top of page

AP CSE 2020-21సంవత్సరమ్ కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించి ఆదేశములు.

Updated: Jul 26, 2020

ఆర్.సీ.నం.151/ఏ&ఐ/2020 తేది 25-07-2020.


పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ - 2020-21 విద్యా సంవత్సరం - కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు – మరింత స్పష్టత కొరకై ఆదేశములు ఇచ్చుట - గురించి.

💁🏻‍♂️ PLEASE GO THROUGH POINTS 33, 34 & 35

〰〰〰〰〰〰〰〰

File No.ESE02-30/94/2020-A&I-CSE

కమిషనర్, పాఠశాల విద్యాశాఖవారి కార్యావర్తనములు

ప్రస్తుతం: వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఏ.ఎస్

ఆర్.సి.నం: 151/ ఆ&1/2020, తేది: --.07.2020

విషయం: పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ - 2020-21 విద్యా సంవత్సరం - కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు – మరింత స్పష్టత కొరకై ఆదేశములు ఇచ్చుట - గురించి.


నిర్దేశములు:

1. ఈ కార్యాలయపు ఉత్తర్వులు ఆర్.సి.నం: 151/ ఆ&1/2020 తేది : 9.7.2020

2. ఈ కార్యా లయపు ఉత్తర్వులు ఆర్.సి.నం: 151/ ఆ&1/2020తేది: 10.7.2020

3. కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య &మరియు అక్షరాస్యత విభాగం వారి ఉత్తర్వులు డి.ఓ.నం. 1-2/2020- IS.5 తేది: 06.07.2020

4. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వారి ఉత్తర్వులు F.No.NCPCR/202021/REC/EDU తేది: 07.07.2020

5.కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య &మరియు అక్షరాస్యత విభాగం వారి ఉత్తర్వులు డి.ఓ.నం. 10-2/2020- IS.4 తేది: 09.07.2020.


నేపథ్యం :

1. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 19.3.2020 నుండి 31.3.2020 వరకు రాష్ట్రంలో గల అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, ఉపాధ్యాయ విద్యా శిక్షణా సంస్థలు తక్షణం మూసివేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడమైనది.

2. సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ పదవ తరగతి పరీక్షలకు సమాయత్తమయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఆయా వసతి గృహాలను పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు తగు జాగ్రత్తలు నిర్వహణకు అనుమతినిస్తూ మిగిలిన అన్ని సంక్షేమ వసతి గృహాలను తక్షణమే మూసివేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

3. విస్తృతంగా ప్రబలుతున్న కరోనా నేపథ్యంలో జాతీయ వ్యాప్తంగా 3 మే 2020 వరకు పొడిగించబడిన లాక్ డౌన్ దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా 20 ఏప్రిల్ 2020న విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు మూసివేత కొనసాగింపు ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది.

4. పదో తరగతి విద్యార్థుల కోసం 21 ఏప్రిల్ 2020 నుండి 15 మే 2020 వరకు 'విద్యామృతం' అనే కార్యక్రమం పేరిట దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాలను మరియు 'విద్యా కలశం' అనే కార్యక్రమం ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఆకాశవాణి ద్వారా రేడియో పాఠాలను అందించడం జరిగింది.

5. విద్యార్థులు తమ తమ ఇంటివద్దనే ఉండి పాఠాలను వీక్షించడం, వినడం ద్వారా పదో తరగతి పరీక్షలకు సమాయత్తం కావలసినదిగా సూచించడమైనది.

6. తదుపరి 11 జూన్ 2020 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ కోవిడ్ - 19 పరిస్థితులు దృష్ట్యా 2020-21 విద్యా సంవత్సర ప్రారంభ తేదీని తదనుగుణంగా ప్రకటిస్తామని ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది.

7. 2020-21 విద్యా సంవత్సర ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా పాటించవలసిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ ఓ పి) క్షేత్రస్థాయి అధికారులకు పంపడమైనది.

8. దీనితోపాటుగా కేంద్రప్రభుత్వం వారు నిర్దేశించిన 'ఆరోగ్య సేతు' యాప్ను విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులు తమ తమ మొబైళ్లలో ఇనస్టాల్ చేసుకొనుటకు తగిన సూచనలు ఇవ్వడమైనది.

9. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ - 19 పరిస్థితులు దృష్ట్యా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేయుటకు నిర్ణయం తీసుకుంది.

10. ఒకటో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ వేదికగా ప్రత్యామ్నాయ విద్యాభ్యసన ప్రక్రియలో భాగంగా జూలై 2020 నుండి 31 జూలై 2020 వరకు 'విద్యావారధి' పేరిట బ్రిడ్జి కోర్సును నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో తరగతి పాఠ్యాంశాలలోని ముఖ్యాంశాల పునశ్చరణతో వీడియో పాఠాలు రూపొందించి, ప్రసారం చేయబడుతున్నవి.

11. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తమ సందేహాలను నివృత్తి చేసుకొనుటకు, వారు చేసిన వర్కుషీట్లను పరిశీలించేందుకు ఉపాధ్యాయులను వారానికి ఒకసారి పాఠశాలకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తమకు చేరిన వర్కుషీట్లను పరిశీలించి తగు సూచనలను ఇవ్వవలసినదిగా కోరడమైనది.

12. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను పాఠశాలలోనికి అనుమతించరాదని ప్రత్యేకించి కోరడమైనది.

13. ప్రైవేటు పాఠశాలలు 2020-21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించి ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నందుకు ప్రత్యేక రుసుములతో పాటుగా, స్కూలు ఫీజులను కూడా చెల్లించమని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా పత్రికల ద్వారా, విద్యార్థి సంఘాలు మరియు ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

14. ఈ ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభించలేదని, విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులు విషయంలో ఒత్తిడి చేయవద్దని, మరియు ఈ విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచద్దని, ఆన్ లైన్ క్లాసుల ద్వారా రెగ్యులర్ పాఠాలు బోధించవద్దని, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు నిర్దేశాల ద్వారా సూచించడమైనది.

15. 31 జూలై 2020 వరకు లాక్ డౌన్ పొడిగింపు, అన్ లాక్ 2.0 నిర్దేశాలను దృష్టిలో ఉంచుకుని 31 జూలై 2020 వరకు విద్యా సంస్థలను మూసి ఉంచాలన్న నిబంధనను ఆధారంగా ఆన్లైన్/ దూరవిద్య విధానాలను కొనసాగింపు చేయుటకు ఉత్తర్వులు ఇచ్చినందున మరియు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ (ఎన్ సి ఇ ఆర్ టి) వారి ద్వారా రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండరును క్షేత్రస్థాయి అధికారులకు పంపిస్తూ తగు చర్యలను చేపట్టవలసిందిగా క్షేత్రస్థాయి అధికారులకు కోరడమైనది.

16. అయినప్పటికి వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలు మరింత స్పష్టతను ఇవ్వాలని కోరినందున ఈ దిగువ ఆదేశాలు ఇవ్వడమైనది.


ఆదేశాలు:

17. ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేటు పాఠశాలలు భారత ప్రభుత్వం నుంచి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్ సి ఇ ఆర్ టి) వారు విడుదల చేసిన ప్రత్యామ్నాయ అకడమిక్ కాలెండరునే అనుసరించవలసినదిగా ఆదేశించడమైనది.

18. 2020-21 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలల పునఃప్రారంభం గురించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా వెలువడవలసి ఉన్నది.

19. అయితే, ప్రస్తుతానికి, రాష్ట్రంలో పాఠశాలలని 5 సెప్టెంబరు 2020 నుండి ప్రారంభించాలని ఆలోచిస్తున్నందువల్ల, తేది 27-7-2020 నుండి 4-9-2020 వరకు అన్ని పాఠశాలల్లోనూ ఈ కింది విధంగా చర్యలు తీసుకోవలసినదిగా సూచించడమైనది.


విద్యార్థి వారీ ప్రణాళిక:

20. మొదటగా ప్రతి ఉపాధ్యాయుడూ తన తరగతిలోని విద్యార్థులకు విద్యార్థివారీ ప్రణాళికను రూపొందించుకోవాలి.

21. విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి.

అ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (హై టెక్),

ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు (లో టెక్),

ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు(నో టెక్).

22. గ్రామస్థాయిలోనూ, పట్టణాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులు ఎక్కువమందికి ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేనందువల్ల ముఖ్యంగా వారి పైన దృష్టి పెట్టే విధంగా ఉపాధ్యాయుడు తన ప్రణాళిక తయారు చేసుకోవాలి.

23. ఆ ప్రణాళికలో ఆయా తరగతుల వారికి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు సూచించిన విధంగా ఈ దిగువ పాఠ్యప్రణాళిక రూపొందించుకోవాలి.

అ) 1 నుండి 5 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 (నాలుగు వారాలు

మొదటి భాగం, 8 వారాలు రెండో భాగం) వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో చూపిన కృత్యాలు చేయించడం. ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి. వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫొటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి. ఆ కృత్యపత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేసి వారి ద్వారా విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి. దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలు పర్యవేక్షణ, ప్రత్యామ్నాయ కాలెండర్ పర్యవేక్షించాలి.

ఆ) 6 నుండి 8 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో చూపిన ప్రాజెక్టు పనులు పిల్లలద్వారా చేయించాలి. పిల్లలు అటువంటి కృత్యాలు ఏ విధంగా చేపట్టాలో వారి తల్లిదండ్రులకు వివరించాలి. దూర దర్శన్ ద్వారా ప్రతి వారం ఒక పాఠం ద్వారా వివరించాలి.

దూరదర్శన్ సౌకర్యం ఉన్న విద్యార్థులను లేని విద్యార్థులతో ఇద్దరిద్దరు చొప్పున జతపరిచి సౌకర్యాలు ఉన్న విద్యార్థుల ద్వారా సౌకర్యాలు లేని విద్యార్థులకు సమాచారాన్ని చేరవేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వారు ఆ విధంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నారో లేదో తల్లిదండ్రుల ద్వారా పర్యవేక్షించుకోవాలి.

ఇ) 9, 10 తరగతులకు: వీరికి విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఇందుకుగాను, నాలుగు వారాల ప్రత్యామ్నాయ కాలెండరును ఉపయోగించుకోవాలి. వారికి ఆన్ లైన్, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు. అంతేకాక స్థానికంగా అందుబాటులో ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లయితే వారి సేవలు కూడా వినియోగించుకోవచ్చు.


పాఠశాల ప్రణాళిక:

24. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థివారీగా తన ప్రణాళిక రూపొందించుకున్న తరువాత ప్రధానోపాధ్యాయుడు వాటిని పరిశీలించి పాఠశాల ప్రణాళిక రూపొందించుకోవాలి. జూలై 27 నుంచి సెప్టెంబరు 4 వరకు 40 రోజుల వ్యవధి ఉన్నందున, నలభై రోజుల ప్రణాళిక ద్వారా తాము ఎటువంటి అభ్యసన ఫలితాలు సాధించబోతున్నదీ నిరంతరం పర్యవేక్షిస్తూ స్పష్టంగా భౌతిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.


తల్లిదండ్రుల కమిటీ సమావేశం:

25. పాఠశాలవారీ ప్రణాళిక రూపొందించుకున్నాక, తల్లిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా తక్కిన తల్లిదండ్రులకి సమాచారం అందించాలి.

26. ఆ సమావేశంలో తమ ప్రణాళికను వివరించాలి. అలాగే స్థానికంగా ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్ఛంద సేవలు వినియోగించుకునేలా తల్లిదండ్రుల కమిటీకి సూచించాలి. అటువంటి స్వచ్ఛంద కార్యకర్తలకు ఎటువంటి పారితోషికం ఇవ్వబడదు. ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వబడవు. వారు తమ సేవలను పూర్తి ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా అందచేయవలసి ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఉండాలి.


పరీక్షలు:

27. 1 నుండి 8 వ తరగతి వరకు ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదు. కాని మూల్యాంకనం (అసెస్మెంట్) చేపట్ట వలసి ఉంటుంది. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు సాధించారా లేదా అన్నది మాత్రం పరిశీలించవలసి ఉంటుంది.

28. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్లు నిర్వహించుకోవచ్చు గాని, అవి కేవలం ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరుకు సంబంధించినవే అయి ఉండాలి. విద్యాసంవత్సరం ఇంకా మొదలుకాలేదు కాబట్టి, సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించరాదు. విద్యార్థులు, వారికి రూపొందించిన వారాంతపు కృత్యాల ద్వారా పొందవలసిన 'లెర్నింగ్ అవుట్ కమ్స్'ను సాధించారా లేదా అనే విషయంలో స్పష్టత ఉండాలి.


ప్రీ ప్రైమరీ:

29. రాష్ట్రంలో కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ ద్వారా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్టు, విద్యార్థులు యూనిఫాం ధరించి ఆన్ లైన్ తరగతులకు హాజరు కావలసిందిగా తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. అటువంటి ప్రయత్నాలు చట్టపరంగానే కాక నైతికంగా కూడా చెల్లనేరవు. అటువంటి ప్రయత్నాల్ని సామాజిక దురాచారాలుగా తల్లిదండ్రులు గుర్తించవలసి ఉంటుంది. అటువంటి ఆదేశాలు ఇచ్చే విద్యాసంస్థల్ని అలాంటి ప్రయత్నాలు చేయకూడదని ఇందువెంట ఆదేశించనైనది.


ఆన్ లైన్ తరగతులు:

30. ఆన్ లైన్ తరగతుల విషయమై కూడా కొంత స్పష్టత నివ్వవలసిందిగా విద్యార్థి సంఘాలు పాఠశాల విద్యాశాఖను కోరుతున్నారు. అందువల్ల ఈ కింది ఆదేశాలను గమనించనైనది.

అ) పాఠ్యబోధనకు ఆన్ లైన్ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన పాఠ్యప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి.

ఆ) ఆన్ లైన్ అంటే కంప్యూటర్ ద్వారా గాని దూరదర్శన్ ద్వారా గాని చేపట్టే బోధన విషయంలో ఒక రోజుకి

ఎంత సమయం కేటాయించాలి అన్నదాని మీద భారత ప్రభుత్వం ఈ విధంగా స్పష్టం చేసింది.

పూర్వప్రాథమిక: కేవలం తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వటానికి మాత్రమే. ఏ రోజైనా కూడా ముప్పై నిమిషాలకు మించరాదు

1 నుండి 8 తరగతుల దాకా: ఏ రోజైనా సరే రోజుకి ప్రతి సెషన్ 30నుండి 45 నిమిషాల మాత్రమే ఉండాలి. ఆ సెషన్లు రెండుకన్నా ఎక్కువ ఉండరాదు.

9 నుండి 10 వ తరగతి దాకా: ఏ రోజైనా సరే రోజుకి ప్రతి సెషన్ 30నుండి 45 నిమిషాల మాత్రమే ఉండాలి. ఆ సెషన్లు నాలుగు కన్నా ఎక్కువ మించి ఉండరాదు.

ఇ) పైన పేర్కొన్న సమయానికి మించి ఏ పాఠశాలగాని, ఏ యాజమాన్యంగాని ఆన్ లైన్ బోధన చేపట్టరాదు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అంశంలో అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచించనైనది.


పాఠశాలల్లో ప్రవేశాలు:

31. అన్ని పాఠశాలల్లోనూ 2020-21 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలు చేపట్టవచ్చును.

32. ఆ విధంగా ప్రవేశాలు చేపట్టడానికి ఈ దిగువ చూపిన విధంగా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.

అ) కోవిడ్ -19 నివారణకి చేపట్టిన సూచనలను ఉల్లంఘించకుండా ప్రవేశాలు చేపట్టాలి.

ఆ) ప్రవేశాల నిమిత్తం ఏ ఒక్క విద్యార్థిని పాఠశాలకు రప్పించరాదు.

ఇ) 2019-20లో ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 7 వరకు, ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 9 వ తరగతి వరకు చదివి, ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించబడ్డ విద్యార్థులందరిని తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేసి వారి పేర్లు పాఠశాల అడ్మిషను రిజిష్టరులో పై తరగతిలో నమోదు చేయాలి.

ఈ) ప్రాథమిక పాఠశాలల్లో 5 వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7 వ తరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులు తదనంతరం ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి. 6వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, 8 వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి.

ఉ) తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చు నిమిత్తం వారి రికార్డు ఓటు / ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు ఆయా సర్టిఫికేట్లను తల్లిదండ్రులకు విధిగా అందించాలి. అదే విధంగా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు ఓటు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల విషయంలో నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి. ఒకవేళ విద్యార్థి రికార్డు ఓటు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే కాలక్రమంలో వాటిని పొందుపరచమనాలి.

ఊ) ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు పొందే మోడల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలు మొదలైన పాఠశాలల విషయంలో కూడా ఈ సూత్రాన్నే అనుసరించాలి.

ఎ) బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి. వలస పోయిన కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా పాఠశాలలో చేర్చుకునే బాధ్యత ఉపాధ్యాయులదే.

ఏ) వలస పోయిన కుటుంబాల పిల్లలు, వలసలనుండి తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో ఐడెంటిటీ నిరూపణ తప్ప మరే విధమైన ధ్రువపత్రాలూ అవసరం లేదు.

ఒ) ప్రత్యేక అవసరాల గల పిల్లలను కూడా పాఠశాలలో చేర్పించుకోవాలి. వారికి తగిన విధంగా కృత్యాలను మార్పులు చేసి కనీస అభ్యసన స్థాయిలు పొందే విధంగా చేయాలి.

ఓ) ప్రవేశాలు పూర్తి కాగానే ఎప్పటికప్పుడు ఛైల్డ్ ఇన్ఫోలో నమోదు చేస్తుండాలి.


ఉపాధ్యాయులు హాజరు:

_33. విద్యార్తివారీ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయడం మొదలు పెట్టాక, ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లోను, ఉన్నత పాఠశాలల్లోనూ కూడా వారానికి ఒకసారి హాజరు కావలసి ఉంటుంది. కాని అందరూ విధిగా ఒక్కరోజే హాజరు కావలసిన అవసరం లేదు. వారు వారు ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి, ఎన్ని సార్లు హాజరు కావాలన్న విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఆదేశాలు నాడు నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి._

_34. ఆ విధంగా హాజరు అయినప్పుడు ఉపాధ్యాయులు బయో మెట్రిక్ హాజరు నమోదు చెయ్యనవసరం లేదు._

_35. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నవారు, కంటెయిన్ మెంటు జోన్లలో నివసిస్తున్నవారు, శారీరిక వైకల్యం కలిగినవారు, కంటెయిన్ మెంటు జోన్లలో పాఠశాలలు ఉన్నవారు భౌతికంగా పాఠశాలలకు హాజరు కానవసరం లేదు. కాని వారు కూడా తమ తరగతి వారీగా , విద్యార్థివారీగా ప్రణాళికలు తప్పని సరిగా రూపొందించుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ తప్పనిసరిగా ప్రణాళిక అమలు పర్చాలి._


ఉపాధ్యాయుల పని సమీక్ష:

36. ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యవలసి ఉంటుంది. ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది. మరుసటి రోజు నుండి రోజుకు అయిదుగురు చొప్పున తల్లిదండ్రులకు మరలా ఫోన్ చేసి వారి పిల్లల పురోగతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.

37. ఆ విధంగా ఉపాధ్యాయుడు తాను చేసిన రోజువారీ పనిని ఒక డైరీలో నమోదు చేసుకుని ఆ పేజీలను ప్రతి శనివారం ఫొటో లేదా డాక్యుమెంట్ ఫార్మేట్లో గూగుల్ ఫారంలో అప్ లోడ్ చేయాలి.

38. ఆ విధంగా నమోదు చేసిన వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.

39. అందరు యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆ మార్గదర్శకాలు గమనించవలసినదిగా కోరనైనది. ఈ మార్గదర్శకాలు ఆంగ్లంలో ఉన్నవి ఉన్నట్లుగా పొందుపరుస్తున్నాం. తెలుగు అనువాదం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్ సిఇ ఆర్ టి) వారు త్వరలో 'అభ్యాస' యాప్ ద్వారా విడుదల చేయనున్నారు.

40. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో ఒక వాట్సప్ గ్రూపును రూపొందించి రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల మూల్యకనం, ప్రగతికి సంబంధించిన విషయాలు పాలుపంచుకోవాలి.

41. డిజిటల్ మాధ్యమాలు ఏవీ అందుబాటులో విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సంచార వాహనాలను రూపొందించడమైనది. ఈ వాహనాలు ఆయా విద్యార్థులు ఉండే ప్రదేశాలను గుర్తించి వారిని ఈ ప్రత్యామ్నాయ బోధనభ్యసన ప్రక్రియలో పాల్గొనేటట్లు కృషి చేయడం జరుగుతుంది.

42. దీనితో పాటు అనుబంధంగా 'ప్రత్యామ్నాయ అకడమిక్ కాలెండర్' జత చేయడమైనది.



వాడ్రేవు చినవీరభద్రుడు,

ఐ.ఎ.ఎస్., కమిషనర్,

పాఠశాల విద్యాశాఖ (పూ.అ.బా.)

అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు

అందరు సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు

అందరు ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకులకు


ఈ ప్రతి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ వారి సమాచారం నిమిత్తం సమర్పించనైనది.

కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ వారికి

సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ వారికి

సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ వారికి,

సంచాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారికి

సంచాలకులు, పట్టణ పరిపాలన అభివృద్ధి శాఖ వారికి

కమిషనర్, ఇంటర్మీడియెట్ విద్య వారికి

గౌరవనీయ పాఠశాల విద్యాశాఖామాత్యుల కార్యాలయంలో ప్రత్యేకాధికారి వారికి.


Click here to download Rc.no ⬇️


Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page